నల్లగొండ జిల్లాలో నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
డిండి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 151/2013 కేసుకు సంబంధించి చందంపేట మండలం గన్నెర్లపల్లి గ్రామానికి చెందిన నక్క పర్వతాలు (యాదవ్) డిండి మండలానికి చెందిన ఎస్సీ యువతితో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. అనంతరం బాధితురాలు పెళ్లి చేసుకోవాలని అడగగా, నక్క పర్వతాలు మరియు అతని అత్త నీలం సత్తమ్మ కలిసి కులాన్ని దూషిస్తూ పెళ్లికి నిరాకరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు డిండి పోలీసులు IPC సెక్షన్లు 417, 420, 323, 506 రెడ్ విత్ 109 IPCతో పాటు ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) సవరణ చట్టం-2015లోని సెక్షన్ 3(1)(x) కింద కేసు నమోదు చేశారు.
విచారణ అనంతరం కోర్టు ప్రధాన నిందితుడు నక్క పర్వతాలు (A1), నీలం సత్తమ్మ (A2)లకు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(1)(x) కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.
అలాగే A1 నక్క పర్వతాలకు IPC 417 కింద ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష, IPC 420 కింద మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. IPC 323, 506 కింద ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించింది.
కోర్టు ఆదేశాల మేరకు అన్ని శిక్షలు ఏకకాలంలో అమల్లో ఉండనున్నాయి. దీంతో A1 నక్క పర్వతాలకు మొత్తం 11 సంవత్సరాల వివిధ శిక్షలు మరియు రూ.5,000 జరిమానా విధించగా, A2 నీలం సత్తమ్మకు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించబడింది.
ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.నరసింహ వాదనలు వినిపించగా, అప్పటి డిండి ఎస్సై ఎం.రామాంజనేయులు కేసు నమోదు చేశారు. దేవరకొండ ఎస్డీపీఓ కె.మనోహర్ దర్యాప్తు నిర్వహించారు.
ప్రస్తుతం డిండి SHOగా బాలకృష్ణ, సీఐగా కె.బీసన్న, దేవరకొండ SDPOగా ఎం.వి.శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. కోర్టు విధుల్లో హెడ్ కానిస్టేబుల్ కె.కృష్ణన్, కానిస్టేబుల్ పి.లింగయ్యలు పాల్గొన్నారు.
నిందితులకు శిక్ష పడేలా సమగ్ర ఆధారాలు సమర్పించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
