రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తాండూర్, ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుంచి జరిగే పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.. అక్రమ రవాణా లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ తనిఖీల్లో తాండూర్ ఇన్స్పెక్టర్ పరమేశ్వర్, ధరూర్ ఇన్స్పెక్టర్ రఘు రాములు, ఎస్ఐ రాఘవేందర్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
