ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్.. రూ.52.5 లక్షల విలువైన గంజాయి పట్టివేత
Nalgonda Police జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా కేతేపల్లి పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి, రూ.52.5 లక్షల విలువైన 104.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ Sharath Chandra Pawar తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు, నాకాబందీలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో కేతేపల్లి ఎస్ఐ సతీష్కు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కు భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందింది.
వెంటనే పోలీసు సిబ్బంది, క్లూస్ టీమ్తో కలిసి కొర్లపహాడ్ టోల్ ప్లాజా సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో సూర్యాపేట వైపు నుంచి హైదరాబాద్కు వస్తున్న గ్రీన్ కలర్ అశోక్ లేలాండ్ లారీని అనుమానంతో ఆపగా, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
లారీని తనిఖీ చేయగా నాలుగు పెద్ద ప్లాస్టిక్ బస్తాల్లో బ్రౌన్ టేప్తో ప్యాకింగ్ చేసిన 103 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మొత్తం గంజాయి బరువు 104.5 కేజీలుగా గుర్తించారు.
అరెస్టు చేసిన నిందితులు పరంవిర్ సింగ్ @ లంబు (జమ్మూ), షా అలం పర్వేష్ ఆలం అన్సారి (ముంబై)గా గుర్తించారు. విచారణలో ఒడిశా రాష్ట్రంలోని గంజం జిల్లా అడవుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి ముంబైకు తరలిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న బిక్రం సింగ్, ఫరూక్ @ రాజు భాయి, భావు @ కేదర్ ప్రధాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు ఈ కేసులో 104.5 కేజీల గంజాయి, అశోక్ లేలాండ్ లారీ, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్ రాష్ట్ర మాదకద్రవ్యాల నెట్వర్క్పై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
