మహబూబాబాద్ జిల్లా షీటీమ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ధాన్యం మార్కెట్లో మహిళా భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది రైతులు, వ్యవసాయ మార్కెట్ కార్మికులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు.
సమాజంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న వివక్ష, లింగ అసమానత, సెక్సిజం, మిసోజనీ, పితృస్వామ్య భావజాలం వల్ల కలిగే దుష్పరిణామాలపై షీటీమ్ సిబ్బంది ప్రజలకు వివరించారు. మహిళల భద్రత, గౌరవ రక్షణ కోసం అమల్లో ఉన్న POSH Act-2013 గురించి అవగాహన కల్పిస్తూ, ఉద్యోగ స్థలాల్లో వేధింపులు ఎదురైతే తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు.
షీటీమ్ ఎలా పనిచేస్తుంది, మహిళలు, బాలికలకు ఎలాంటి రక్షణ, సహాయం అందిస్తుందనే విషయాలను కూడా ప్రజలకు వివరించారు. బాలలపై లైంగిక దాడులు, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం ప్రాముఖ్యత, బాలల హక్కుల పరిరక్షణపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలు, ప్రేమ పేరుతో యువత మోసపోవడం, ఎలోపింగ్ ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల అక్రమ రవాణా, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచితులపై నమ్మకం పెట్టుకోరాదని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన చైల్డ్ హెల్ప్లైన్ 1098, మహిళా హెల్ప్లైన్ 1091, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930, డయల్-100 సేవల గురించి వివరించారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే షీటీమ్ వాట్సాప్ నంబర్ 8712656935 కు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల్లో మహిళా భద్రత, బాలల రక్షణపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని షీటీమ్ ఎస్ఐ సునందా తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, మార్కెట్ కార్మికులు షీటీమ్ సేవలను అభినందించారు.
