హైదరాబాద్లోని షాద్నగర్, మక్తల్ అటవీ ప్రాంతాల్లో ఎయిర్ గన్లతో వన్యప్రాణులను అక్రమంగా వేటాడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను కమిషనర్ టాస్క్ఫోర్స్ (గోల్కొండ టీమ్) మరియు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు ఎయిర్ గన్లు, ఒక లైసెన్సుడ్ రైఫిల్, 20 తూటాలు, స్కార్పియో కారు సహా మొత్తం రూ.8 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వేట దృశ్యాలు ఉన్న మొబైల్ ఫోన్లు కూడా పోలీసులు సీజ్ చేశారు.
అరెస్ట్ అయిన నిందితులు మొహమ్మద్ ముజఫర్ హుస్సేన్, మీర్ అహ్మద్ అమీర్, అబ్దుల్లా బిన్ సహైన్, సౌద్ బిన్ మొహమ్మద్ బలాబ్, మసూద్ బిన్ మొహమ్మద్ మరియు కె. శేఖర్. వీరిలో శేఖర్ మక్తల్ ప్రాంతంలో అడవిలో వన్యప్రాణుల ఆచూకీ తెలియజేసేవాడిగా గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా గత ఏడాది కాలంగా షాద్నగర్, మక్తల్ అటవీ ప్రాంతాల్లో పలుమార్లు వేటకు పాల్పడినట్లు బయటపడింది. జింకలు, నెమళ్లు, కుందేళ్లు, పావురాలు వంటి జంతువులను ఎయిర్ గన్లతో కాల్చి చంపి, మాంసాన్ని వండి తినేవారు. వేట అనంతరం జంతువుల అవశేషాలను జూరాల బ్యాక్ వాటర్స్ కాలువలో పడేసినట్లు వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన మీర్ అహ్మద్ అమీర్ తెలంగాణ రైఫిల్ అసోసియేషన్కు చెందిన షూటర్ కాగా, తన లైసెన్సుడ్ ఆయుధాన్ని అక్రమ వేటకు వినియోగించినట్లు గుర్తించారు.
జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు పలుమార్లు నెమళ్లు, జింకలను వేటాడినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా జాతీయ పక్షి నెమలిని కూడా వేటాడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితులను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఆపరేషన్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో టాస్క్ఫోర్స్ సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు.
