నగరంలో నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని రౌడీ షీటర్ను అడ్డుకున్న ఓ ఆటో డ్రైవర్ సాహసం అందరినీ ఆకట్టుకుంది. మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన నిందితుడిని తన ఆటోతో ఢీకొట్టి నిలువరించిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో వెలుగుచూసింది.
మార్చి 4వ తేదీ తెల్లవారుజామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ సమీపంలో డబీర్పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అక్కడి నుంచి వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ సంఘటనను గమనించాడు.
సుమారు 100 మీటర్లు ముందుకు వెళ్లిన జాహెర్ వెంటనే తన ఆటోను వెనక్కి తిప్పి, పారిపోవడానికి ప్రయత్నిస్తున్న నిందితుడి బైక్ను ఢీకొట్టి కిందపడేశాడు. నిందితుడు కర్రతో దాడి చేసినప్పటికీ భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నాడు. ఈ సమయంలో గస్తీ పోలీసులు అక్కడికి చేరుకుని రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకున్నారు. తన పని ముగిసిన వెంటనే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా జాహెర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆటో నంబర్ ఆధారంగా గోషామహల్ పోలీసులు జాహెర్ను గుర్తించి, అతని సాహసాన్ని వెలుగులోకి తెచ్చారు.
జాహెర్ చూపిన ధైర్యాన్ని అభినందిస్తూ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఆయనను బంజారాహిల్స్లోని తన కార్యాలయంలో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. సమాజంలో ఇలాంటి బాధ్యతాయుత పౌరులు ఉండటం నేరస్తులకు భయాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. నేరాలు జరుగుతున్నప్పుడు భయపడకుండా వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కేసులో నిందితుడు మహ్మద్ సోహేల్ను అరెస్ట్ చేసి, గోషామహల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సన్మాన కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
