సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను నేరుగా విన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల వినతులను ఓపికగా ఆలకించిన ఎస్పీ, సంబంధిత అంశాలపై ఎస్.హెచ్.ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు సులభంగా పోలీస్ సేవలు అందేలా, వారి సమస్యలు వేగంగా పరిష్కారం అయ్యేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
