ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడం, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం కోసం ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 19 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో ఎస్పీ నేరుగా ఫోన్లో మాట్లాడి, బాధితుల ఫిర్యాదులను చట్టపరంగా వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు న్యాయం చేయడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన వారి వినతులు, ఫిర్యాదులను శ్రద్ధగా స్వీకరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫిర్యాదుదారులకు పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలిగేలా పనిచేయడం అత్యంత ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.
గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చని, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు.
