వేసవికాలం ప్రారంభమవడంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు, యువకులు బయట కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈత నేర్చుకునేందుకు చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు.
ఈత సరదా విషాదంగా మారకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈత రాని వారు ఒంటరిగా బావులు, చెరువులు, కాలువల వద్దకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈత నేర్చుకునే వారు తప్పనిసరిగా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ముఖ్యంగా చెరువులు, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు.
అదే విధంగా, మైనర్లకు వాహనాలు ఇవ్వడంపై కూడా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మైనర్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇది వారికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదకరమని తెలిపారు. మైనర్కు వాహనం ఇచ్చిన యజమానిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
పిల్లల భద్రత తల్లిదండ్రుల బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చని జిల్లా ఎస్పీ సూచించారు.
