వార్త:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సడెన్ తనిఖీలు నిర్వహించి అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. ఏప్రిల్ 15న హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో మొత్తం 13 మీ సేవా కేంద్రాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీలలో పలు అవకతవకలు గుర్తించబడ్డాయి. అల్వాల్ ప్రభుత్వ మీ సేవా కేంద్రం వద్ద ఖాళీగా ఉన్న కుల, ఆదాయం, నివాస ధృవపత్రాలు, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్లు, నోటరీ స్టాంప్ ఉన్న పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఉపయోగించి నకిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
అలాగే, మీ సేవా కేంద్ర సిబ్బంది మరియు అనధికార మధ్యవర్తుల మధ్య యూపీఐ లావాదేవీలు, వాట్సాప్ చాట్స్ ఉన్నట్లు ఆధారాలు లభించాయి. దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు కూడా వెల్లడైంది. ఖమ్మం కేంద్రంలో అధికారం లేని వ్యక్తులు సర్టిఫికెట్లపై సంతకాలు చేస్తున్నట్లు గుర్తించారు.
సరూర్నగర్లోని ఒక కేంద్రంలో ఖాళీ నోటరీ పేపర్లు, ముందుగా సంతకం చేసిన బాండ్ పేపర్లు, వేర్వేరు లైసెన్స్ హోల్డర్ల లాగిన్ ఐడీలు దొరికాయి. తార్నాకా ప్రాంతంలో ప్రతి దరఖాస్తుపై నోటరీ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు బయటపడింది. సంగారెడ్డిలో స్టాంప్ పేపర్ అమ్మకాల రిజిస్టర్లు నిర్వహించకపోవడం గమనించారు.
సూర్యాపేటలో ఇతర కేంద్రాల సర్టిఫికేట్ బాండ్లు, అలాగే అభ్యర్థులకు ఇవ్వాల్సిన అసలు సర్టిఫికెట్లు నిల్వలో ఉండటం కూడా గుర్తించారు. ఈ వ్యవహారాల్లో మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని, సంబంధిత కేంద్రాలపై చర్యల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ప్రజా సేవకులు లంచం కోరితే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ సూచించింది.
