Breaking News

అక్రమ బేకరీపై దాడి: రూ.2.77 లక్షల సామాగ్రి స్వాధీనం, ఒకరి అరెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 02: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ఎటువంటి అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ పోలీసులు దాడి చేసి భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు టప్పాచబుత్రా పోలీసులు సంయుక్తంగా జిర్రాలోని ‘చాంద్ బేకరీ’పై ఈ దాడి నిర్వహించారు.

ఈ దాడిలో సుమారు రూ.2,77,630 విలువైన ముడి సరుకులు, తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సయ్యద్ ఖదీర్ (42)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల దర్యాప్తులో నిందితుడు ఎటువంటి ఫుడ్ లైసెన్స్, తయారీ అనుమతులు లేదా ట్రేడ్ లైసెన్స్ లేకుండా బేకరీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తేలింది. అపరిశుభ్ర వాతావరణంలో నాణ్యత లేని ఉత్పత్తులు తయారు చేసి, కిరాణా షాపులు, కేఫ్‌లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు.

కేంద్రంలో ఎటువంటి అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం గమనార్హం. ఇది ప్రజల ఆరోగ్యంతో పాటు భద్రతకు కూడా ప్రమాదకరమని పోలీసులు తెలిపారు.

దాడిలో మైదా బస్తాలు, డాల్డా కార్టన్లు, చక్కెర, కేక్ పౌడర్, ఆయిల్ టిన్నులు, బ్రెడ్ బాక్సులు, చికెన్, బరువు తూచే యంత్రం తదితర సామాగ్రిని సీజ్ చేశారు.

వీర హనుమాన్ విజయ యాత్రకు హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత: 3,000 మంది పోలీసులతో బందోబస్తు

నిందితుడిపై టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్‌లో BNS సెక్షన్లు 274, 275, 318(4) కింద కేసు నమోదు చేశారు.

ఈ ఆపరేషన్ హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. గోల్కొండ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్. వెంకటేష్, టప్పాచబుత్రా ఇన్‌స్పెక్టర్ జి. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *