▪️ డ్రగ్స్ కేసుతో తీవ్ర మానసిక వేదన ఎదుర్కొన్నట్లు వెల్లడి
▪️ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “మీట్ ది ప్రెస్”
హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ప్రత్యేక గుర్తింపు పొందిన నటి హేమ, ఇటీవల తనపై నమోదైన డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఎదుర్కొన్న మానసిక వేదన గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలుగు ఫిలిం ఛాంబర్లో సోమవారం నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ, “డ్రగ్స్ కేసులో వచ్చిన ఆరోపణలు నన్ను తీవ్రంగా మానసికంగా కలచివేశాయి. ఆ సమయంలో చనిపోవాలనిపించింది. అంతగా కుంగిపోయాను” అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, చివరకు నిర్దోషిగా బయటపడ్డానని స్పష్టం చేశారు.
డ్రగ్స్ వ్యవహారంలో కొందరు మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లాయని ఆమె ఆరోపించారు. ఆ వార్తల వల్ల తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. “నా కుటుంబం చాలా బాధపడింది. అది మా జీవితంలో చాలా కఠినమైన కాలం” అని పేర్కొన్నారు.
అయితే మొత్తం మీడియాను తప్పుపట్టలేమని, నిజాయితీగా పనిచేసే మీడియా సంస్థలు ఉన్నాయని, భవిష్యత్తులో కూడా మీడియా తనకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాద్ రావు మాట్లాడుతూ, హేమ తన మనసులోని బాధను వ్యక్తపరచుకునేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశామని తెలిపారు. గౌరవ అధ్యక్షుడు ప్రభు మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు వార్తలు పెరిగాయని, హేమ నిర్దోషిత్వాన్ని కోర్టు నిరూపించిందని అన్నారు.
ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ, హేమ ఎన్నో పాత్రల ద్వారా మంచి గుర్తింపు పొందారని, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగిన ఆమె కూడా తప్పుడు వార్తల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. హేమ తన అనుభవాలను పంచుకుంటూ, భవిష్యత్తులో మరింత ధైర్యంగా ముందుకు సాగుతానని తెలిపారు.

