ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ..
• ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ.
• సమస్యల పరిష్కారానికి సంబంధిత ఎస్.హెచ్.ఓలకు తక్షణ ఆదేశాలు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత అంశాలపై ఎస్.హెచ్.ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఎలాంటి భయాలు లేకుండా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
