అక్రమ గంజాయి విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన నల్లగొండ 1 టౌన్ పోలీస్…
నల్గొండ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు 50 వేల విలువగల 2 కిలోల గంజాయి, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు స్మార్ట్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు.
నల్లగొండ జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో 15 మార్చి 2026న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో నల్గొండ పట్టణ శివారు ప్రాంతమైన మునుగోడు రోడ్డు గణేష్ నగర్ కాలనీ శ్మశాన వాటిక సమీపంలో కొంతమంది గంజాయి తాగుతూ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో డీఎస్పీ శివరాం రెడ్డి గారి నేతృత్వంలో నల్గొండ వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆకస్మిక దాడి నిర్వహించారు. దాడిలో హైదరాబాద్లోని ధూల్పేట్ ప్రాంతం నుండి గంజాయిని అక్రమంగా తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి స్థానిక యువతకు, విద్యార్థులకు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.
అరెస్టు అయినవారు మహమ్మద్ ఫూర్ఖాన్ (19), కారింగుల ప్రదీప్ (22), వల్కీ వినోద్ కుమార్ (26), బైరుగోండ నవీన్ (24)గా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 2 కిలోల గంజాయి, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు స్మార్ట్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం.72/2026 U/Sec. 8(C) r/w 20(b)(ii)(B), 27(a) of NDPS Act-1985 గా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇప్పటికే కళాశాలు, పాఠశాలలు, హాస్టళ్లు,నిర్మానుష ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా అక్రమ గంజాయి విక్రయించిన, సేవించిన అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని, ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కేసును నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుబడించిన నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు కే. సతీష్, బి. లచ్చి రెడ్డి మరియు సిబ్బంది లింగరెడ్డి, శ్రీనివాస ప్రసాద్, అంజయ్య, సైదులు లను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
