Breaking News

24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న బాలానగర్ పోలీసులు.

“అయ్యో పాపం” అని ఆశ్రయమిస్తే అదను చూసి ఆ ఇంటికే కన్నం వేసిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. నమ్మిన వారిని మత్తులో ముంచి, లక్షల విలువైన సొత్తుతో ఉడాయించిన కేటుగాళ్లను పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదర్శ్ నగర్ నివాసితురాలు యర్రమిల్లి హిమ బిందు వద్దకు ఆమె దూరపు బంధువైన చేరకుపల్లి లక్ష్మి సర్వాణి (35) కొద్దిరోజుల క్రితం వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పడంతో మానవత్వంతో హిమ బిందు ఆమెకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. అయితే, ఈ ఆదరణను ఆసరాగా చేసుకున్న లక్ష్మి సర్వాణి ఇంటిని దోచుకోవాలని పథకం పన్నింది. మార్చి 13న ఇంట్లో వారు అప్రమత్తంగా లేని సమయంలో వారికి మత్తు పదార్థం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది. అనంతరం తన అనుచరులైన పర్వతం కిరణ్ కుమార్ (30), కొనపర్తి యశ్వంత్ (19), భారడి దిలీప్ (23) మరియు శివ సహాయంతో ఇంట్లోని విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకుని పరారైంది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బాలానగర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలను (CCTV, సెల్ టవర్ డేటా) విశ్లేషించారు. నిందితులు తప్పించుకునే లోపే శనివారం వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి లక్ష్మి సర్వాణితో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, శివ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుండి పోలీసులు భారీగా రికవరీ చేశారు మొత్తం విలువ సుమారు రూ. 50 లక్షలుగా తెలిపారు. అందులో బంగారం: 30 తులాలు, వెండి: 2.3 కిలోలు, 4 సెల్ ఫోన్లు ఉన్నాయి. కేసు నమోదైన 24 గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకుని, సొత్తును స్వాధీనం చేసుకున్న బాలానగర్ సీఐ నర్సింహా రాజు, క్రైమ్ బృందాన్ని ఏసీపీ నరేష్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సిబ్బందికి నగదు పురస్కారాలను అందజేశారు.

షేక్‌పేట్‌లోని 272 సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను ప్రారంభించిన – వి.సి. సజ్జనర్ ఐపిఎస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *