సంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో, పరీక్ష కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉంచకూడదని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బి.యన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులుగా తిరగడం నిషేధమని స్పష్టం చేశారు. ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఇతర ఎవరూ కూడా పరీక్ష కేంద్రంలో సెల్ఫోన్ వినియోగించరాదని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, తమ తమ పరిధిలోని ప్రతి పరీక్ష కేంద్రాన్ని ప్రత్యేకంగా సందర్శించి కనీస వసతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని సూచించారు. పరీక్ష సమయాల్లో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది ఎగ్జామ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలని, ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్ నుండి పరీక్ష కేంద్రాలకు మరియు పరీక్ష అనంతరం పోస్టాఫీసుకు తరలించే వరకు ఎస్కార్ట్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని తెలిపారు.
పరీక్ష కేంద్రాల లోపల ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరాదని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
