తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు జిల్లా ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొనసాగిందని తెలిపారు. అనంతరం అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతమై, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందని వివరించారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజాపాలన అని ఎస్పీ తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వ సేవలను ప్రతి ఇంటికీ చేరవేయడం ప్రజాపాలన ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి రోజున సమాజానికి సేవ చేయాలనే ఉత్సాహంతో విధుల్లో చేరినట్లే, చివరి వరకు అదే సేవాభావాన్ని కొనసాగిస్తూ ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.
తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రజల కోసం సేవాభావం, సమానత్వం, న్యాయం వంటి విలువలను ప్రజాపాలన దినోత్సవం మనకు గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బి. రమేష్, ఇన్స్పెక్టర్లు నాగేశ్వర్ రావు, రామకృష్ణ రెడ్డి, రామునాయుడు, నగేష్, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియేల్, ఎస్బీ, డీసీఆర్బీ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
