నల్గొండ జిల్లాలో మైనర్ బాలికను అపహరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి నల్గొండ అత్యాచారం, పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు గురువారం తీర్పు వెలువడిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు.
తిప్పర్తి మండలానికి చెందిన షేక్ అలియాస్ మహమ్మద్ ఖయ్యూం గతంలో ఇదే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలి 51 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడినట్లు ఎస్పీ తెలిపారు. అయితే బెయిల్పై బయటకు వచ్చిన అనంతరం అదే బాలికను మరోసారి అపహరించి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై నల్గొండ-II టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై నమోదైన అభియోగాల్లో IPC సెక్షన్ 366, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని సెక్షన్ల కింద నేరం రుజువైంది. అయితే IPC సెక్షన్ 344 కింద అభియోగం రుజువు కాకపోవడంతో ఆ కేసు నుంచి నిందితుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
నిందితుడికి IPC సెక్షన్ 366 కింద 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా, పోక్సో చట్టం సెక్షన్ 5(j)(ii) రెడ్ విత్ 6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం సెక్షన్ 3(2)(v) కింద యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మొత్తం రూ.3,000 జరిమానా విధించింది.
నిందితుడికి కఠిన శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన పోలీసు అధికారులు, కోర్టు ప్రాసెస్లో సహకరించిన సిబ్బంది, సమర్థవంతంగా వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
మైనర్ బాలికలు, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. నేరాలపై సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా పోలీసు శాఖ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
