- జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
- జిల్లా పోలీస్ కార్యాలయంలో గణనాథునికి ప్రత్యేక పూజలు
- భద్రతా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపు
నల్లగొండ:
వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణపతి వద్ద సోమవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (ఐపీఎస్) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు చేసి, జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. అనంతరం జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు: ఎస్పీ
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరూ గణేష్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, పరస్పర గౌరవం, సోదరభావంతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. ఉత్సవాల వేళ సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
పోలీసు నిబంధనలు పాటించాలి
ఉత్సవ కమిటీ నిర్వాహకులు, సభ్యులు పోలీసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఉత్సవాలను ప్రశాంతంగా ముగించేందుకు పోలీసు యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పూజా కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ సీఐ నాగరాజు, ఆర్ఐలు సంతోష్, సూరప్ప నాయుడు, కళ్యాణ్ రాజ్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
