ముస్తాబద్, మే 30: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 101 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం ప్రారంభించారు. ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సీసీ కెమెరా నెట్వర్క్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసు శాఖ నేరాలను అరికట్టడంలో ముందంజలో ఉందని చెప్పారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని పేర్కొంటూ, డిజిటల్ నిఘా వ్యవస్థల ద్వారా నేరాలకు పాల్పడిన వ్యక్తులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభతరమవుతుందన్నారు.
ప్రజలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం, నేరాల దర్యాప్తును వేగవంతం చేయడం, ప్రజల భద్రతను పెంపొందించడం కోసం సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయగలమని అన్నారు.
ముస్తాబద్ మండలంతో పాటు పలు గ్రామాల్లో 101 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ గణేష్, ప్రజాప్రతినిధులు, సన్రైజ్ సీసీ కెమెరాల కంపెనీ ప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

