బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదరులకు జిల్లా పోలీస్ శాఖ తరపున జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈద్గా మైదానాలు, మసీదులు, ప్రార్థనా కేంద్రాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.
పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు, ప్రత్యేక పికెట్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి మతసామరస్యంతో, శాంతియుతంగా బక్రీద్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వివాదాస్పద పోస్టులు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా, అనుమానాస్పద సంఘటనలు లేదా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
