ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను ఓపికగా విని, సంబంధిత అంశాలపై ఎస్.హెచ్.ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
పోలీస్ శాఖ ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా పరిశీలించి న్యాయం జరిగేలా కట్టుబడి పనిచేస్తోందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
