హైదరాబాద్లో చిన్నారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ‘రోడ్డు భద్రత వేసవి శిబిరం–2026’ను ఘనంగా ప్రారంభించారు. గోషామహల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయల్ డేవిస్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
10 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ శిబిరంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనతో పాటు ప్రాథమిక చికిత్స (BLS), నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, దస్తూరి మెరుగుదల, వ్యక్తిత్వ వికాసం మరియు అగ్నిమాపక భద్రత వంటి అంశాలపై శిక్షణ అందించనున్నారు.
చిన్నతనం నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాన్ని తగ్గించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 100 మంది చిన్నారులు ఈ శిబిరంలో నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ మాట్లాడుతూ చిన్నారులు గొప్ప లక్ష్యాలు పెట్టుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. దేశం గర్వించేలా ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
“ఇక్కడ నేర్చుకున్న రోడ్డు భద్రత నియమాలను మీ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు వివరించి సమాజంలో ట్రాఫిక్ రాయబారులుగా మారాలి” అని చిన్నారులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్-II డీసీపీ కాజల్ సింగ్, హోండా గ్రూప్ జీఎం శిశిర్ చతుర్వేది, ఆర్యన్ డాన్స్ అకాడమీకి చెందిన సరోజ్ బాలా, రాజ్ ఈవెంట్స్కు చెందిన అనంత్ రాజ్తో పాటు పలువురు అధికారులు, బోధకులు పాల్గొన్నారు.
