నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను పరిశీలించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 30 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి వివరించగా, ఆయా ఫిర్యాదులను ఓర్పుతో విన్న ఎస్పీ సంబంధిత అధికారులకు తక్షణ విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి బాధితులకు సరైన న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించవచ్చని, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.
పోలీస్ గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
