నిర్మాణంలో ఉన్న భవనాలకు తామే యజమానులమని నమ్మించి రెడీమిక్స్ కాంక్రీట్ సరఫరాదారులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నగదు, కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. షాద్నగర్కు చెందిన చిల్లా సూర్య ప్రతాప్ రెడ్డి రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మే 2న కమ్మరి రమేష్ అలియాస్ విశాల్ అనే వ్యక్తి ఆయనను సంప్రదించి, కొత్తూరులో తనకు నిర్మాణంలో ఉన్న భవనం ఉందని, కాంక్రీట్ అవసరమని తెలిపాడు. తాను ఆ భవన యజమానినని నమ్మించి రూ.50 వేల అడ్వాన్స్ చెల్లించి కాంక్రీట్ ఆర్డర్ ఇచ్చాడు. మిగిలిన రూ.4,23,500 పని పూర్తయ్యాక చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు.
పని పూర్తయిన అనంతరం డబ్బులు అడగగా బ్యాంక్ ద్వారా పంపిస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు భవనం వద్దకు వెళ్లి విచారించగా, విశాల్ అసలు యజమాని కాదని, భవన యజమాని వద్ద నుంచి ఇప్పటికే కాంక్రీట్ పనికి సంబంధించిన పూర్తి డబ్బులు వసూలు చేసుకున్నాడని తెలిసి షాక్కు గురయ్యాడు.
దర్యాప్తులో నిందితులు కమ్మరి రమేష్ (A1), వేముల ప్రేమ్ కుమార్ (A2) కలిసి పథకం ప్రకారం కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లను గుర్తించి, తామే యజమానులమని చెప్పి రెడీమిక్స్ సరఫరాదారులను సంప్రదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అడ్వాన్స్ ఇచ్చి కాంక్రీట్ వేయించుకుని, అనంతరం అసలు యజమానుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకుని సరఫరాదారులకు మాత్రం చెల్లించకుండా పరారవుతున్నట్లు వెల్లడైంది.
ఇదే తరహాలో చేవెళ్ల, గజ్వేల్, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలి ప్రాంతాల్లో సుమారు రూ.16.50 లక్షల వరకు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మే 8న ఇన్ముల్నర్వ గ్రామంలో మరో మోసానికి ప్రయత్నిస్తుండగా కొత్తూరు పోలీసులు చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,39,500 నగదు, ఎర్టిగా కారు (TS-29-G-6888), ఒక ఐఫోన్ సహా నాలుగు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కొత్తూరు ఇన్స్పెక్టర్ జి. నర్సయ్య మరియు పోలీసు సిబ్బంది ఈ కేసును ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీహెచ్ శిరీష అభినందించారు.
