రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమాల ప్రదేశాలను సందర్శించిన వారు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాలయ కార్యక్రమం మరియు బహిరంగ సభకు హాజరయ్యే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సౌకర్యాలు సమృద్ధిగా ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత శాఖలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు.
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీఐపీల భద్రతలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. దేవాలయ పరిసర ప్రాంతాలు, ముఖ్యమంత్రి రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు మరియు సభా ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించిన ఎస్పీ, రద్దీ నియంత్రణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయాలని ఆమె కోరారు.
ఈ పర్యటనలో జిల్లా అడిషనల్ ఎస్పీ బి. రాములు నాయక్, ఐఎస్డబ్ల్యూతో అడిషనల్ ఎస్పీ వాసుదేవరెడ్డి, డీఎస్పీలు ఎన్. శ్రీనివాస్, ఎస్. శ్రీనివాస్, నర్సింగ్ యాదయ్య, జానయ్య, సీఐలు, ఎస్సైలు మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
