Breaking News

స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు: సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

సిరిసిల్ల, ఏప్రిల్ 15, 2026: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. రోడ్డు పై ప్రయాణించే సమయంలో చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఇతరుల కుటుంబాలను కూడా ప్రమాదంలోకి నెట్టవచ్చని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు ప్రజల రక్షణ కోసమేనని, వాటిని పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని సూచించారు.

వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ తప్పక ధరించాలని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం చేయవద్దని, తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రమాదం జరిగిన తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారని, ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.

జిల్లాలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రజలు మరియు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమం

జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్‌ఐ సురేష్, ఎస్‌ఐ శ్రీకాంత్, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్, ఏఎంవీఐ పృథ్విధర్, పోలీస్ సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *