Breaking News

విద్యార్థులే అతిథులుగా.. ‘సీపీతో ఒక రోజు’

హైదరాబాద్, ఏప్రిల్ 02: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచి, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్ నగర పోలీసులు ‘సీపీతో ఒక రోజు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఏప్రిల్ 1 నుంచి 45 రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8వ నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పోలీసుల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతిరోజూ ఒక పాఠశాల నుంచి 20 మంది ప్రతిభగల విద్యార్థులను (10 మంది బాలురు, 10 మంది బాలికలు) ఎంపిక చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ విభాగాలను సందర్శింపజేస్తున్నారు.

బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఐపీఎస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళహాట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి వీర హనుమాన్ విజయ యాత్ర బందోబస్తు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో బాధితుల ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కార విధానాన్ని ప్రత్యక్షంగా వివరించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, మెయిన్ పీసీఆర్, ఐటీ సెల్, స్పెషల్ బ్రాంచ్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్ వింగ్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ వంటి విభాగాలను సందర్శించారు. నేరాల నియంత్రణలో సాంకేతికత పాత్ర, మహిళా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల బాధ్యతలపై ఉన్నతాధికారులు వివరించారు.

అక్రమ బేకరీపై దాడి: రూ.2.77 లక్షల సామాగ్రి స్వాధీనం, ఒకరి అరెస్ట్

పోలీస్ అంటే కేవలం నేరాలను అరికట్టే యంత్రాంగం మాత్రమే కాకుండా, సమాజ భద్రతకు భరోసా ఇచ్చే సేవా వ్యవస్థ అని సీపీ సజ్జనర్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో చట్టంపై గౌరవం, సామాజిక బాధ్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల ముప్పు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

మహిళా భద్రత విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *