ఎల్లారెడ్డిపేట: ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యేలా విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. బుధవారం ఆయన ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు, రికార్డులను సమగ్రంగా పరిశీలించిన ఎస్పీ, దర్యాప్తులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రజలతో మమేకమై నేర నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, గ్రామాలను తరచూ సందర్శించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రజా ఫిర్యాదులపై ఆలస్యం చేయకుండా తక్షణ స్పందన ఇవ్వాలని తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా డయల్ 100 కాల్స్కు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. రౌడీ షీటర్లపై నిఘా కొనసాగించాలని సూచించారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఎస్పీ కఠినంగా ఆదేశించారు. ఈ సందర్భంగా పదిర వద్ద ఉన్న ఇసుక రీచ్ను తనిఖీ చేసి తవ్వకాల విధానం, రవాణా అనుమతులు, రికార్డులను పరిశీలించారు. అక్రమంగా ఇసుక రవాణా లేదా నిల్వలు ఉంటే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో అవసరమని పేర్కొన్న ఎస్పీ, గ్రామాలు మరియు వ్యాపార సంస్థల్లో విస్తృతంగా వాటి ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు.
ఈ తనిఖీలో ఎస్పీ వెంట ఎస్ఐ రాహుల్ రెడ్డి పాల్గొన్నారు.
