Breaking News

నల్లగొండలో ఘనంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

నల్లగొండ: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో విస్తృత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి కారణాల వల్లనే జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి వాహనదారు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు.

హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు పోలీస్ కళాబృందం, చిన్నారులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. యమధర్మరాజు వేషధారణలో కళాకారులు ప్రజలకు వినూత్నంగా సందేశం అందించారు. హెల్మెట్ ధరించకపోతే ప్రమాద సమయంలో ప్రాణనష్టం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఎస్పీ మాట్లాడుతూ, యువత అధిక వేగంతో వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రతపై సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

“ఆ సమయంలో చనిపోవాలనిపించింది” — నటి హేమ భావోద్వేగ వ్యాఖ్యలు

అదేవిధంగా, వాహనదారులు తమ వాహన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. భవిష్యత్తులో పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్‌బి సిఐ రాము, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్, ఎస్సైలు, పోలీస్ కళాబృందం సభ్యులు, విద్యార్థులు, వాహనదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *