గంజాయి, ఓపెన్ డ్రింకింగ్కు చెక్ పెట్టేందుకు జిల్లా వ్యాప్తంగా నిరంతర దాడులు
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరిష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లాలో గంజాయి వినియోగం మరియు పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం (ఓపెన్ డ్రింకింగ్)ను నిరోధించేందుకు ప్రత్యేక దాడులు నిరంతరంగా కొనసాగుతున్నాయి.
ఈ చర్యలలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఒంటరి ప్రాంతాలు, నిర్జన ప్రదేశాలు, అసాంఘిక కార్యకలాపాలకు అనువైన ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు మరియు దాడులు నిర్వహించడం జరుగుతుంది.

ప్రతి పోలీస్ స్టేషన్ నుండి అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనుమానాస్పద ప్రదేశాలను సమగ్రంగా పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నారు .
గత 10 రోజుల కాలంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 130 ఒంటరి/నిర్జన ప్రదేశాలు గుర్తించి తనిఖీ నిర్వహించారు .అలాగే ఓపెన్ డ్రింకింగ్ లో పట్టుపడిన 37 మంది పై కేసులు నమోదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా యువతకు గంజాయి మరియు మద్యం దుర్వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
అలాగే గంజాయి అలవాటుకు గురైన (అడిక్టెడ్) వ్యక్తులను గుర్తించి, వారికి పునరావాసం (Rehabilitation) కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి వ్యక్తులను కౌన్సెలింగ్ ద్వారా మార్గనిర్దేశం చేసి, సమాజంలో తిరిగి మంచి జీవితం గడపడానికి సహాయం చేస్తామని వెల్లడించారు.
గంజాయి అలవాటును మానుకోవాలని భావిస్తున్న వారు లేదా పునరావాసం కోసం పోలీసుల సహాయం కావాలనుకునే వారు ఎటువంటి భయాందోళనలు లేకుండా తమ సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరిష్, ఐపీఎస్ మాట్లాడుతూ,
“గంజాయి వినియోగం మరియు పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని అన్నారు.గంజాయి అలవాటుకు గురైన వారిని పునరావాసం ద్వారా మార్పు తీసుకురావడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని తెలిపారు . మారాలని భావించే వారు నిర్భయంగా ముందుకు రావాలి, పోలీస్ శాఖ మీకు అండగా ఉంటుందని పిలుపునిచ్చారు.

అలాగే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసరాల్లో ఎక్కడైనా గంజాయి వినియోగం లేదా ఓపెన్ డ్రింకింగ్ జరుగుతున్నట్లయితే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు గంజాయి రహిత సమాజం నిర్మాణం కోసం కట్టుబడి ఉందని,ఇలాంటి తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని ఎస్పీ తెలిపారు.
