Breaking News

సైబర్ నేరగాళ్ల మాయలో పడి సర్వస్వాన్ని కోల్పోతున్న

సైబర్ నేరగాళ్ల మాయలో పడి సర్వస్వాన్ని కోల్పోతున్న అమాయకులను కాపాడుకోవాలని, సమాజంలో సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రతి పౌరుడూ చొరవ తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో ‘సైబర్ సింబా’ వలంటీర్ల ఓరియేంటషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల కట్టడిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత హైదరాబాద్’ ప్రచారంలో భాగంగా సైబర్ సింబా అనే వలంటీర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.

వాట్సాప్ గ్రూపుల్లో కేవలం ‘గుడ్ మార్నింగ్’, ‘గుడ్ నైట్’ మెసేజ్ లకే పరిమితం కాకుండా, సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించే సందేశాలను విరివిగా షేర్ చేయాలని సూచించారు.

గతేడాది నవంబర్‌లో ప్రారంభమైన ‘సైబర్ సింబా’ కార్యక్రమంలో ఇప్పటికే 1,717 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. 5,118 డోర్-టు-డోర్ కార్యక్రమాల ద్వారా రెండు లక్షల మందికి అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం ద్వారానే ఈ నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని చెప్పారు.

ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేర్లతో సైబర్ కేటుగాళ్లు రిటైర్డ్ న్యాయమూర్తులు, విద్యావంతులను సైతం మోసం చేస్తున్నారని, సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల యువతులు, మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

డైల్ 100కు వెంటనే స్పందించి బాధితులకు త్వరిత సేవలు అందించాలి .

సైబర్ నేరం జరిగిన మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పేర్కొన్న ఆయన, ఆ సమయంలోపు 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.

అలాగే, బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచే ఫిర్యాదు చేసేందుకు ‘సి-మిత్ర’ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ చైతన్యం వల్లే గతంలో రోజుకు 80 ఉన్న ఫిర్యాదులు ఇప్పుడు 60కి తగ్గాయని, ఇది ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమని వివరించారు.

హైదరాబాద్‌ను ‘సైబర్ క్రైమ్ రహిత నగరం’గా మార్చే లక్ష్యంతో సాగుతున్న ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ (క్రైమ్స్ & ఎస్.ఐ.టి) శ్రీ.ఎం. శ్రీనివాసులు, డీసీపీలు శ్రీ.ఎ. అరవింద్ బాబు,శ్రీ ఎస్. చైతన్య కుమార్,శ్రీ. జి. చంద్రమోహన్,శ్రీ. బి. రాజేష్, శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్ తదితర పోలీస్ ఉన్నతాధికారులతో పాటు వలంటీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *