వైన్ షాప్ దొంగతనం కేసులో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ – సీసీటీవీ కెమెరాల సహాయంతో కేసు ఛేదించిన నల్లగొండ 1 టౌన్ పోలీసులు
రూ.1,77,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం – వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి
నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్యాలగూడ రోడ్లో ఉన్న మహాలక్ష్మి వైన్ షాప్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించి, అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
నిందితుడి వద్ద నుండి రూ.1,77,000 నగదు మరియు ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
నల్గొండ జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆధ్వర్యంలో “నేను సైతం” కార్యక్రమం ద్వారా వ్యాపార సంస్థలు, షాపులు మరియు వార్డులలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలో 07-12-2025 తేదీన రాత్రి నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో గల మహాలక్ష్మి వైన్ షాప్లో గుర్తు తెలియని వ్యక్తి సుమారు రూ.5 లక్షలకు పైగా నగదు దోచుకెళ్లినట్లు షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ. రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా వైన్ షాప్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా, గతంలో పలు వైన్ షాపుల్లో దొంగతనాలు చేసిన అంతరాష్ట్ర నేరస్థుడు కుమ్మరి నర్సింహా రావు అని గుర్తించారు. వెంటనే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ రోజు ఉదయం దేవరకొండ రోడ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, నల్గొండ పట్టణంలోని మూడు వైన్ షాపుల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం అతడి వద్ద నుండి మహాలక్ష్మి వైన్ షాప్ దొంగతనానికి సంబంధించిన రూ.1,77,000 నగదు మరియు ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు.
నిందితుడి వివరాలు :
కుమ్మరి నర్సింహా రావు (35), తండ్రి అంజయ్య, కులం కుమ్మరి, వృత్తి కుక్ మాస్టర్. స్వస్థలం సయ్యద్ మల్కాపూర్ గ్రామం, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. ప్రస్తుతం మచ్చయపాలెం గ్రామం, బెల్లంకొండ మండలం, గుంటూరు జిల్లా నివాసి.
నిందితుడు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆంధ్రప్రదేశ్లో దొంగతనాలు చేస్తే పోలీసులు గుర్తించే అవకాశం ఉందని భావించి తెలంగాణ రాష్ట్రంలో దొంగతనాలు చేయడం ప్రారంభించినట్లు తెలిపాడు.
ఈ కేసును ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ. రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సతీష్, లచ్చిరెడ్డి, వెంకటనారాయణ మరియు సిబ్బంది అంజయ్య, రబ్బానీ శ్రీను లను డీఎస్పీ కె. శివరాం రెడ్డి అభినందించారు.
