నల్లగొండ జిల్లా పరిధిలో సంక్రాంతి పండగ ముగించుకుని ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ దిశగా తిరుగు ప్రయాణాలు అధికంగా సాగుతున్న నేపథ్యంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ సమగ్ర చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ముఖ్య కూడళ్లలో 450 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామని తెలిపారు.
వాహన రద్దీని ఎప్పటికప్పుడు గమనించేందుకు డ్రోన్ల ద్వారా గాలిలో నుంచే నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తూ, రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట్ల వెంటనే ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు అధికంగా ప్రయాణించే నేషనల్ హైవేలు, టోల్ ప్లాజాలు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న సమయాల్లో వాహనాల గమనాన్ని సజావుగా కొనసాగించేందుకు అవసరమైతే మార్గమళ్లింపులు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా అవసరమున్న చోట్ల మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచామని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ప్రమాదకర ఓవర్టేకింగ్ వంటి వాటిపై కఠిన నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో అలసటగా అనిపిస్తే సురక్షిత ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకోవాలని, నిరంతర డ్రైవింగ్కు దూరంగా ఉండాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు లేదా అత్యవసర సహాయం అవసరమైనప్పుడు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ / 100 ను సంప్రదించాలని తెలిపారు.
పండగ అనంతరం తిరుగు ప్రయాణాలు చేసే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, పోలీస్ శాఖకు సహకరించి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజ్ఞప్తి చేశారు..
