భారత ప్రజాస్వామ్యానికి పునాది – రాజ్యాంగ దినోత్సవం: బాలానగర్ సీఐ నర్సింహా రాజు

భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది వేసిందని, ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటారని సీఐ నర్సింహా రాజు అన్నారు. బాలానగర్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్ఏమ్ అరుణజ్యోతి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా రాజ్యాంగ రూపకర్త డా. బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా సీఐ నర్సింహా రాజు మాట్లాడుతూ సరిగ్గా ఇదే రోజున 1949, నవంబర్ 26వ తేదీన, భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నామన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగమని గర్వంగా తెలిపారు, దీని రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షత వహించిన ముసాయిదా కమిటీ, ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిందని.. ఇందులో 395 ఆర్టికల్స్, 22 భాగాలు, మరియు 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను పునరుద్ఘాటించడంతోపాటు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలను నొక్కిచెప్పారు.
సైబర్ నేరాలు, డ్రగ్స్ పై అవగాహన:

ఇటీవల సైబర్నేరాలు అధిక మయ్యాయని, ప్రస్తుతం మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని వాటిని అరికట్టేందుకు ప్రజలు సైబర్ నేరగాళ్ల చెప్పిన మాటలు నమ్మవద్దని, వెంటనే పోలీసులను సంప్రదించి సహకరించాలన్నారు. విద్యార్థులు అవగాహన పెంచుకుని ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యువత ఇంటర్నెట్ పరిమితికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని అన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా జాగృతం చేయాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం అరుణజ్యోతి తోపాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
