
నేషనల్ పోలీస్ అకాడమీ నుండి 170 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు TGICCC భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు సి.వి. ఆనంద్, ఐపీఎస్,డిజి, కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు తో ముఖాముఖిగా మాట్లాడారు. సివి ఆనంద్ హైదరాబాద్ నగరంలో 10 సంవత్సరాలుగా విధులు నిర్వహించిన తన అనుభవాన్ని పంచుకున్నారు. గణేష్ ఉత్సవాల బందోబస్తు నిర్వహించడం 13వ సారి అని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నాలుగో సారి అని తెలిపారు. హైదరాబాద్ దేశంలోనే అత్యంత సున్నితమైన, విస్తారమైన నగరాల్లో ఒకటని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారని, అందుకే పండుగల నిర్వహణ చాలా ముఖ్యమని కమిషనర్ వివరించారు. గణేష్ ఉత్సవాలకు పోలీసులు బందోబస్తు ఎలా నిర్వహిస్తారో వివరిస్తూ, ఈ ఏడాది నిమజ్జనం కోసం చివరి రోజున సుమారు 25,000 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో జరిగే ఈ ఉత్సవానికి ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా భద్రత కల్పించడం చాలా ముఖ్యమని చెప్పారు. గణేష్ ఉత్సవం, మిలాద్ ఉన్ నబీ, బోనాలు, దసరా నవరాత్రులు, హనుమాన్ ర్యాలీ, శ్రీరామనవమి ర్యాలీ వంటి పండుగల సందర్భంగా తొక్కిసలాటలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు తీసుకుంటున్న కార్యాచరణ ప్రణాళిక (Plan of Action), సన్నాహాలు (Preparation), వ్యూహాలు (Tactics) మరియు ఇతర చర్యల గురించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆన్లైన్ అనుమతి ఫారాలు, విగ్రహాలకు జియోట్యాగింగ్, డ్రోన్లు, యాప్లు, సీసీటీవీల వాడకం, అలాగే మల్టీ-ఏజెన్సీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి సాంకేతికతను పోలీసులు ఎలా వినియోగిస్తున్నారో కూడా కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ నివాస్ సేపట్, ఐపీఎస్, డిప్యూటీ డైరెక్టర్, బేసిక్ కోర్సు-2, కల్మేశ్వర్ సింగేన్వార్, ఐపీఎస్, అసిస్టెంట్ డైరెక్టర్, ట్రైనింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, మరియు శ్రీమతి పుష్ప, డీసీపీ, ఐటి సెల్, TGICCC భవనం, బంజారా హిల్స్, హైదరాబాద్ లు పాల్గొన్నారు.

