సేవా పతక గ్రహీతలను సత్కరించిన సీపీ సజ్జనార్
హైదరాబాద్, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పోలీస్ సేవా పతకాలకు ఎంపికైన ఇద్దరు హైదరాబాద్ పోలీస్ అధికారులను నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ ఘనంగా సత్కరించారు. ఈ మేరకు శుక్రవారం సీపీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అధికారులను అభినందించారు.
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ జే. నర్సయ్య, విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్.జీ. శివమారుతిని సీపీ సజ్జనార్ అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావం, అత్యుత్తమ నిబద్ధత కనబరిచినందుకే అధికారులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కాయని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో అదనపు డీసీపీ నర్సయ్య, సైబర్ నేరాల నియంత్రణ, సాంకేతిక దర్యాప్తులో ఏసీపీ శివమారుతి కనబరిచిన ప్రతిభ ప్రశంసనీయమన్నారు.
జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పతకాలు సాధించడం ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్కు మరింత కీర్తి తీసుకొచ్చారని పేర్కొన్నారు. వారి సేవలు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే అంకితభావంతో ప్రజాసేవలో కొనసాగుతూ మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
35 ఏళ్లుగా పోలీస్ సేవలో జే. నర్సయ్య
అదనపు డీసీపీ జే. నర్సయ్య 1991లో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరారు. 35 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆయన పలు కీలక కేసుల దర్యాప్తుతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. గతంలో ‘ఇండియన్ పోలీస్ మెడల్’ సహా పలు పతకాలను అందుకున్నారు. తాజాగా రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు.
‘ఆపరేషన్ ఆక్టోపస్’తో సైబర్ మోసాల నెట్వర్క్ ఛేదన
సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్.జీ. శివమారుతి 1995లో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరి 31 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ ద్వారా రూ.127 కోట్ల పాన్-ఇండియా సైబర్ మోసాల నెట్వర్క్ను ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. సాంకేతిక దర్యాప్తులో ప్రతిభకు గుర్తింపుగా 2022లో కేంద్ర హోంమంత్రి పతకాన్ని కూడా అందుకున్నారు. తాజాగా విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీ ఎం. శ్రీనివాస్, ఐపీఎస్, జాయింట్ సీపీలు, డీసీపీలు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని పతక గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర హోంశాఖ 2026 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీస్ సేవలకు 272 గ్యాలంట్రీ మెడల్స్, 83 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 606 విశిష్ట/మెరిటోరియస్ సేవా పతకాలను ప్రకటించింది.
