హైదరాబాద్, ఆగస్టు 15: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పేట్ల బురుజులోని సీఏఆర్ హెడ్క్వార్టర్స్లో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ కమిషనర్ ఘన నివాళులర్పించారు. విధి నిర్వహణలో అంకితభావం, విశేష ప్రతిభ కనబరిచిన 72 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఆహార కల్తీని సమూలంగా అరికట్టేందుకు ప్రత్యేకంగా హెచ్-ఫాస్ట్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టాస్క్ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో పనిచేస్తూ కల్తీదారులపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
నూతన సంవత్సర వేడుకలు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శోభాయాత్రలతో పాటు ఇటీవల ముగిసిన చారిత్రక ఆషాఢ బోనాల ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసేలా అహర్నిశలు బందోబస్తు నిర్వహించిన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
సైబర్ నేరగాళ్ల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ‘ఆపరేషన్ ఆక్టోపస్’ ప్రారంభించినట్లు సీపీ వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన ‘సీ-మిత్ర’ వర్చువల్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 1,700కు పైగా జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుల నమోదులో ‘ఏఐ కాప్రైటర్’ యాప్ కీలకంగా ఉపయోగపడుతోందన్నారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ‘స్పందన – తక్షణ రక్షణ’ మహిళా రెస్పాండర్ వ్యవస్థ ద్వారా రోజుకు సగటున 30 ఫిర్యాదులను స్వీకరిస్తూ సత్వర సేవలు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో 300 మంది మహిళా సిబ్బందికి డ్రైవింగ్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
నగరంలో మాదకద్రవ్యాల నియంత్రణకు ‘హెచ్-న్యూ’ విభాగాన్ని మరింత బలోపేతం చేశామని, డ్రగ్స్ విషయంలో ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీపీ సజ్జనర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్క్వార్టర్స్ డీసీపీ ఆర్. వెంకటేశ్వర్లు, చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే, టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, డీసీపీ (అడ్మిన్) కె. వెంకట లక్ష్మి, అదనపు డీసీపీ బి. కిష్టయ్యతో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
