అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చర్యలు: సీపీ సజ్జనర్ IPS
హైదరాబాద్: గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనర్, IPS అధికారులను ఆదేశించారు.
గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై సీపీ సజ్జనర్ అధ్యక్షతన బుధవారం సాయంత్రం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమగ్ర సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి అడిషనల్ సీపీ (ఎల్అండ్ఓ) శ్రీ తఫ్సీర్ ఇక్బాల్ IPS, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్.వి. కర్ణన్ IAS, జాయింట్ సీపీ (ట్రాఫిక్) శ్రీ డి. జోయల్ డేవిస్ IPS, జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్) శ్రీ ఎస్.ఎం. విజయ్ కుమార్ IPS, జాయింట్ సీపీ (ఫ్యూచర్ సిటీ) శ్రీమతి చందనా దీప్తి IPSతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పోలీసు అధికారులు, కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు హాజరయ్యారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు
సమావేశంలో సీపీ సజ్జనర్ మాట్లాడుతూ గత ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా గణేష్ విగ్రహాల ఊరేగింపు మార్గాల్లో రోడ్లకు అడ్డంగా, వదులుగా ఉన్న విద్యుత్, కేబుల్, ఇంటర్నెట్ వైర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు.
రామాంతపూర్ తరహా ప్రమాదాలు పునరావృతం కాకుండా ఊరేగింపు మార్గాల్లో తగిన ఎత్తులో వైర్లకు క్లియరెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గణేష్ మండపాల నిర్వాహకులకు నిబంధనల ప్రకారం సురక్షిత విద్యుత్ కనెక్షన్లు కల్పించాలని, తప్పనిసరిగా ఎర్తింగ్ పూర్తి చేసి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ అనుమతులు పొందేలా చూడాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ శాఖతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని, విద్యుత్ సరఫరా నిలిపివేత లేదా వైర్ల తొలగింపు వంటి చర్యలకు ముందు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
రోడ్లు, నాలాలు, స్లాబ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
నిమజ్జనానికి ముందే, సెప్టెంబర్ 14/15 నాటికి ప్రధాన మార్గాలు, ఫీడర్ రూట్లలో కొనసాగుతున్న రోడ్డు, నాలా, స్లాబ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీపీ ఆదేశించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు కొత్తగా రోడ్ల తవ్వకాలు, కేబుల్ పనులు ప్రారంభించవద్దని సూచించారు.
పాతబస్తీ ప్రాంతంలో మెట్రో నిర్మాణ పనుల కారణంగా చేపడుతున్న విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
24 గంటలు వైద్య సేవలు, తాగునీరు అందుబాటులో ఉండాలి
ఉత్సవాల సందర్భంగా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ జిల్లా పరిధిలోని 26 ప్రాంతాల్లో, అలాగే బాలాపూర్ పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అంబులెన్సులు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను కోరారు.
ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు పారిశుధ్య చర్యలను నిరంతరం కొనసాగించాలని వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
ట్రాఫిక్, పార్కింగ్పై ప్రత్యేక దృష్టి
నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు తగినన్ని పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ, రవాణా శాఖలు అవసరమైన సంఖ్యలో బస్సులు, గూడ్స్ వాహనాలు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
నిమజ్జనం రోజున వినియోగించే క్రేన్లు, వాటి ఆపరేటర్లు, సూపర్వైజర్లు, మెయింటెనెన్స్ టీమ్ల వివరాలను ముందుగానే పోలీస్ శాఖకు అందించాలని కోరారు.
ప్రజలకు విస్తృతంగా సమాచారం అందించాలి
బడా గణేష్ దర్శనం ముగింపు, నిమజ్జన ఏర్పాట్లు, ట్రాఫిక్ మార్పులు తదితర ముఖ్య సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు టీవీ స్క్రోలింగ్లు, పత్రికా ప్రకటనలు తదితర ప్రచార మాధ్యమాలను విస్తృతంగా వినియోగించాలని సూచించారు.
సెప్టెంబర్ 25న జరిగే ప్రధాన నిమజ్జనం సందర్భంగా ప్రజల సౌకర్యార్థం నగరంలో అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సేవలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, బెగంపేట్ స్టేషన్ల నుంచి రాత్రంతా ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
