రెండు రోజులుగా కొండ చరియల మధ్య చిక్కుకున్న కృష్ణయ్య.. ప్రత్యేక బృందాల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
మహబూబ్నగర్: అడవిలో తప్పిపోయిన ఓ వ్యక్తిని డ్రోన్ కెమెరాల సహాయంతో గుర్తించి మహబూబ్నగర్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. ప్రత్యేక పోలీసు బృందాలు, ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బంది సమన్వయంతో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది.
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం ఆచార్యపూర్ గ్రామానికి చెందిన జాజలి కృష్ణయ్య ఈ నెల 8వ తేదీ ఉదయం సుమారు 9 గంటలకు మేకలను మేపేందుకు గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అయితే తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో కృష్ణయ్య తల్లి జాజలి మంగమ్మ ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి కోయిలకొండ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డి. జానకి, IPS వెంటనే స్పందించారు. తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తూ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు, ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి దట్టమైన అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. కొండలు, లోయలు, ప్రమాదకర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలో కృష్ణయ్య మేకలను మేపుతూ ఓ పెద్ద కొండపైకి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కొండ చరియల మధ్యలోని లోయలో చిక్కుకుపోయినట్లు డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. వెంటనే ప్రత్యేక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి కృష్ణయ్యను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
పోలీసుల విచారణలో కృష్ణయ్య రెండు రోజుల పాటు కొండ చరియల మధ్య చిక్కుకుపోయి, తన వెంట తీసుకెళ్లిన నీటిని తాగుతూ ప్రాణాలు కాపాడుకున్నట్లు వెల్లడైంది. సకాలంలో డ్రోన్ కెమెరాల ద్వారా అతని ఆచూకీ గుర్తించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడగలిగాడు.
రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రత్యేక బృందాలు, ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బంది, డ్రోన్ ఆపరేటర్లను జిల్లా ఎస్పీ డి. జానకి, IPS అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు సమన్వయంతో, నిరంతరం శ్రమించిన సిబ్బంది సేవలను ప్రశంసించారు.
తమ కుటుంబ సభ్యుడిని సురక్షితంగా తమకు అప్పగించిన జిల్లా ఎస్పీ డి. జానకి, IPSతో పాటు పోలీసు బృందాలకు కృష్ణయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
“ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరి ఆచూకీ కోసం చివరి వరకు శ్రమిస్తూ, ప్రజల ప్రాణ రక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తారు” అని జిల్లా పోలీసులు తెలిపారు.
