న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రులు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాలు ఇచ్చాయి. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన ఆటంకాల తొలగింపుపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్-2 విస్తరణ నిర్మాణ వ్యయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు SBICAPS ను కన్సల్టెంట్గా ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణతో పాటు ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు.
అధ్యయన ప్రక్రియ సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. వీరి సమన్వయంతో ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయనున్నారు.
