మాదకద్రవ్యాల అవగాహన వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
జిల్లా ప్రతినిధి: తెలంగాణ ఈగల్ (EAGLE) టీమ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులు, యువత, ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాదకద్రవ్యాల అవగాహన వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఎస్పీ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాలకు దూరంగా ఉండడంతో పాటు, ఇతరులను కూడా వాటి ప్రమాదాలపై అప్రమత్తం చేయాలని సూచించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.
జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
