Breaking News

మహబూబాబాద్ జిల్లాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలు.. గుడుంబా, నకిలీ విత్తనాల స్వాధీనం

మహబూబాబాద్: జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రత, సంక్షేమం మరియు గ్రామీణ ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా నిర్వహిస్తున్న కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.

గార్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్ధారం గ్రామంలో గార్ల–బయ్యారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు 200 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 60 వాహనాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టారు.

అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాల నివారణ, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తత, గంజా వల్ల కలిగే అనర్థాలు, గంజా రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం, గ్రామ భద్రతలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఇదే క్రమంలో మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండేపూడి గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో నకిలీ విత్తనాల విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. మరిపెడ సీఐ పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఆరుగురు వ్యక్తుల వద్ద నుంచి మొత్తం 12 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు ప్రారంభించారు.

జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు

వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో నకిలీ విత్తనాల వల్ల పంటలకు కలిగే నష్టాలు, రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, విత్తనాల కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే బిల్లుతో విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.

ప్రజల ఆరోగ్యం, రైతుల ప్రయోజనాలు, గ్రామాల భద్రతకు భంగం కలిగించే అక్రమ కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ నిరంతరం ప్రత్యేక చర్యలు కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలు, గంజా, గుడుంబా లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *