మహబూబాబాద్, జూన్ 22: నీట్-యూజీ–2026 పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆదివారం మహబూబాబాద్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అభ్యర్థుల ప్రవేశ విధానం, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, అలాగే కేంద్ర పరిసర ప్రాంతాల్లో అమలు చేస్తున్న భద్రతా చర్యలను ఎస్పీ సమీక్షించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగించాలని సూచించారు.
అభ్యర్థులు పరీక్షా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు. పరీక్షల నిర్వహణలో క్రమశిక్షణ, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ తరఫున NEET-UG–2026 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.
