నల్గొండ, జూన్ 21: జిల్లాలో నిర్వహిస్తున్న NEET (UG)-2026 రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా పరీక్షల నిర్వహణను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు. నల్గొండ పట్టణంలోని ఎన్.జీ. కళాశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన ఆయన, భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 అమల్లో ఉన్నందున ఎవరూ గుంపులుగా నిలబడకూడదని, అనవసర రద్దీ సృష్టించవద్దని సూచించారు.
పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు, పరీక్షా సామగ్రి కేంద్రాల నుంచి స్ట్రాంగ్రూమ్కు భద్రంగా చేరే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పరీక్షల పారదర్శకత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నారని, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. పరీక్షల విజయవంతమైన నిర్వహణకు అభ్యర్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
