జిల్లా ప్రతినిధి: జిల్లాలో శనివారం నిర్వహించిన రెండవ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ D. Janaki తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 2,877 కేసులు పరిష్కరించబడినట్లు వెల్లడించారు.
పరిష్కరించబడిన కేసుల్లో 434 ఎఫ్ఐఆర్ కేసులు, 469 డీడీ కేసులు, 1,889 ఈ-పెట్టీ కేసులు, అలాగే 85 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయి.
అదేవిధంగా, సైబర్ నేరాల బారిన పడ్డ బాధితులకు మొత్తం ₹26,88,894 నగదు తిరిగి అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంలో ఈ చర్య కీలకంగా నిలిచిందన్నారు.
జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశ్యం పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, ప్రజలకు సత్వర న్యాయం అందించడమేనని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కోర్టులపై భారం తగ్గడంతో పాటు, బాధితులకు త్వరిత పరిష్కారం లభిస్తోందని పేర్కొన్నారు.
కేసుల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.
జిల్లాలో నిర్వహించిన రెండవ జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడం న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖల సమన్వయానికి నిదర్శనమని అధికారులు తెలిపారు.
