రాజేంద్రనగర్ జోన్ పోలీసుల సమయస్ఫూర్తి, మానవత్వంతో వ్యవహరించిన తీరుతో రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన ఏడాది పసికందు ప్రాణాలు దక్కాయి. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఆధ్వర్యంలోని నైట్ డ్యూటీ ఎస్కార్ట్ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుని సీపీఆర్ (CPR) అందించడం ద్వారా బాలుడిని కాపాడారు.
జూన్ 18 రాత్రి డీసీపీ ఎస్. శ్రీనివాస్ తన నైట్ డ్యూటీ ఎస్కార్ట్ సిబ్బందితో కలిసి పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న MH14JR 9028 నంబర్ గల కారు శంషాబాద్–ఆరాంఘర్ మార్గంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన వెంటనే డీసీపీ, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో ఉన్న ఏడాది బాలుడు శ్వాస తీసుకోకపోవడంతో పాటు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉండగా, డీసీపీ సూచనల మేరకు పోలీసులు వెంటనే బాలుడికి సీపీఆర్ అందించారు.
సిబ్బంది నిరంతర ప్రయత్నాల ఫలితంగా కొద్దిసేపటికే బాలుడు స్పృహలోకి వచ్చి ఏడవడం ప్రారంభించాడు. అనంతరం బాలుడితో పాటు ప్రమాదంలో గాయపడిన వారందరినీ మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
సమయానికి స్పందించి తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన డీసీపీ ఎస్. శ్రీనివాస్, పోలీసు సిబ్బందికి బాధిత కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. తమకు దేవుడిలా అండగా నిలిచారని భావోద్వేగంతో పేర్కొంది.
ఈ రెస్క్యూ ఆపరేషన్లో విశేష సేవలందించిన కార్ హెడ్క్వార్టర్స్ సిబ్బంది పీసీ సిహెచ్. మహేష్, పీసీ ప్రదీప్, పీసీ ఎన్. వెంకటేష్, పీసీ పవన్లను డీసీపీ ఎస్. శ్రీనివాస్తో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.
