నల్గొండ, జూన్ 15: పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు భద్రత, క్రమశిక్షణ, బాధ్యతతో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని నల్గొండ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.
కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు వ్యక్తిగత భద్రతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల్లో సీటుబెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు పెరుగుతున్నందున విద్యార్థులు సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం, పాస్వర్డులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు, నకిలీ ఆఫర్లు, అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అలాగే మాదకద్రవ్యాలు, పొగాకు, మద్యం వంటి హానికర పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు స్నేహితుల ప్రభావానికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు సహచరులను గౌరవిస్తూ, ర్యాగింగ్, వేధింపులు, వివక్ష వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.
చదువు, వ్యాయామం, వినోదం, తగిన విశ్రాంతితో కూడిన సమతుల్య జీవనశైలిని అలవర్చుకోవాలని, పెద్ద లక్ష్యాలు పెట్టుకుని కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయాలు సాధించవచ్చని ఎస్పీ శరత్ చంద్ర పవార్ విద్యార్థులకు సందేశమిచ్చారు.
అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 1098 చైల్డ్ హెల్ప్లైన్, 100/112 ఎమర్జెన్సీ సర్వీస్, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్, అలాగే 8712670266 నల్గొండ జిల్లా మాదకద్రవ్యాల నిర్మూలన హెల్ప్లైన్ నంబర్లను వినియోగించాలని సూచించారు.
