సిరిసిల్ల: వాహనాల నంబర్ ప్లేట్ల తొలగింపు, నంబర్ ప్లేట్ల మార్ఫింగ్ వంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు సిరిసిల్ల పట్టణ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 20 వాహనాలను గుర్తించారు.
ఈ సందర్భంగా ఆయా వాహన యజమానులకు జరిమానాలు విధించడంతో పాటు, వారి ఆధ్వర్యంలోనే సరైన నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయించినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
వాహనాలకు నంబర్ ప్లేట్లు తొలగించడం, నంబర్లు స్పష్టంగా కనిపించకుండా మార్పులు చేయడం చట్టవిరుద్ధమని సీఐ హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రతి వాహనదారుడు తన వాహనానికి నంబర్ ప్లేట్ను స్పష్టంగా కనిపించే విధంగా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సరైన నంబర్ ప్లేట్లు ఉండటం వల్ల దొంగిలించబడిన వాహనాలను గుర్తించడం, నేరాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు.
నంబర్ ప్లేట్ లేకుండా, నంబర్ ప్లేట్కు అడ్డుగా వస్తువులు అమర్చడం, నంబర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించకుండా వాహనాలు నడపడం వంటి చర్యలు తీవ్ర నేరాలుగా పరిగణించబడతాయని పేర్కొన్నారు. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే చీటింగ్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ప్రత్యేక తనిఖీల్లో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శ్రీనివాస్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
