వికారాబాద్: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.కె. అన్వర్ పాషా ఆధ్వర్యంలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్లాపూర్ గ్రామంలో పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నాటు సారా తయారీకి సంబంధించిన భారీ మొత్తంలో ముడి పదార్థాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, కొత్లాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ రత్న్యా నాయక్ (56) వద్ద నుంచి రూ.12 వేల విలువైన 80 లీటర్ల సారా ముడి పదార్థం, రూ.5,250 విలువైన 15 కిలోల నవసాగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.17,250 విలువైన సామాగ్రిని సీజ్ చేశారు.
అదేవిధంగా, బాల్యా నాయక్ (38) నివాసంపై నిర్వహించిన దాడిలో రూ.22,500 విలువైన 150 లీటర్ల సారా ముడి పదార్థం, రూ.350 విలువైన ఒక కిలో నవసాగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం రూ.22,850 విలువైన సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు.
రెండు చోట్ల నిర్వహించిన దాడుల్లో కలిపి రూ.40,100 విలువైన నాటు సారా తయారీ ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, నిందితులను బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్న టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.కె. అన్వర్ పాషా, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై దాడులు నిరంతరం కొనసాగుతాయని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
